భారత్తో సత్సంబంధాలు కొనసాగుతాయా.? లేదా.? అనేది గంగా నది నీటి పంపకాల ఒప్పందంపైనే ఆధారపడి ఉంటుందంటూ బంగ్లాదేశ్ కొత్త మెలిక పెట్టింది. ఈ మేరకు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఒక ప్రకటన విడుదల చేసింది. తమ దేశ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా కొత్త ఒప్పందం కోసం చర్చలు జరపాలని భారత్ను డిమాండ్ చేసింది.
ప్రస్తుతం అమల్లో ఉన్న ఇండో-బంగ్లాదేశ్ గంగా నది నీటి ఒప్పందం 1996లో జరిగింది. అప్పటి ప్రధాని షేక్ హసీనా హయాంలో కుదిరిన ఈ డీల్ ఈ ఏడాది డిసెంబర్తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త ఒప్పందం కుదిరే వరకు పాత ఏర్పాట్లే కొనసాగాలని బంగ్లాదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్ కోరారు. భవిష్యత్తులో జరిగే నీటి ఒప్పందాలకు కాల పరిమితి ఉండొద్దని షరతు విధించారు. గంగా నదిని బంగ్లాదేశ్లో పద్మా నదిగా పిలుస్తారని, అక్కడి వ్యవసాయం, పర్యావరణం, తాగునీటి వ్యవస్థలకు ఈ నది ఎంతో కీలకమని చెప్పారు. బంగ్లాదేశ్లోని మూడో వంతు జనాభా జీవనోపాధి కోసం ఈ నదిపైనే ఆధారపడుతున్నారని తెలిపారు.
అలాగే ఫరక్కా బ్యారేజ్ వల్ల తమకు ఎండాకాలంలో నీటి ప్రవాహం తగ్గిపోతోందని బంగ్లాదేశ్ తెలిపింది. దీనివల్ల నదుల్లో ఉప్పునీరు చేరి, పంటలు దెబ్బతింటున్నాయని వాదిస్తోంది. అయితే కోల్కతా పోర్టు రక్షణ కోసమే ఫరక్కా బ్యారేజ్ నిర్మించినట్లు భారత్ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. కానీ ఈ ఇబ్బందులను అధిగమించే పేరిట బంగ్లాదేశ్ పద్మా నదిపై ఓ మెగా బ్యారేజ్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఇది 2033 నాటికి పూర్తి చేయాలని ప్రధాని తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని కమిటీ నిర్ణయించింది. అంతేకాదు ఈ బ్యారేజ్ నిర్మాణంపై భారత్తో సంప్రదింపులు జరపాల్సిన అవసరం లేదని బంగ్లాదేశ్ ఏకపక్షంగా నిర్ణయించింది.
నీటి సమస్యల పరిష్కారానికి ఇప్పటికే ఇరు దేశాల మధ్య ప్రత్యేక వేదికలు ఉన్నాయని భారత్ ప్రకటించింది. రెండు దేశాల మధ్య ప్రవహించే 54 నదులపై క్రమబద్ధంగా చర్చలు జరుగుతున్నాయని తెలిపింది. ఇరు దేశాల ప్రతినిధులు నిరంతరం సమావేశమవుతూనే ఉన్నారని స్పష్టం చేసింది.