దేశ విభజన జరిగి దాదాపు ఎనిమిది దశాబ్దాలు కావస్తున్న సమయంలో.. పాకిస్థాన్లో చారిత్రక నగరం లాహోర్ పూర్వ వైభవాన్ని చాటుకునేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నగరంలో దాదాపు 80 ఏళ్ల తర్వాత పాత హిందూ, సిక్కు, జైన్ పేర్లు మళ్లీ కనిపిస్తున్నాయి.
విభజన తర్వాత ఇస్లామిక్ పేర్లు పెట్టిన అనేక వీధులు, చౌరస్తాలకు ఇప్పుడు మళ్లీ పాత పేర్లనే పెడుతున్నారు. ఈ మేరకు ఇస్లాంపురా ఇప్పుడు కృష్ణనగర్గా, బాబ్రీ మసీదు చౌక్ జైన్ మందిర్ చౌక్గా, రెహ్మాన్ గల్లీ మళ్లీ రామ్ గల్లీగా మారింది. గత రెండు నెలల్లో తొమ్మిది ప్రాంతాలకు పాత పేర్లు తిరిగి పెట్టగా.. మరికొన్ని ప్రాంతాల పేర్ల మార్పుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతుండటం విశేషం. అయితే ఈ మార్పుల వెనుక పాకిస్థాన్ పంజాబ్ ప్రభుత్వం చేపట్టిన ‘లాహోర్ హెరిటేజ్ ఏరియా రివైవల్’ ప్రాజెక్ట్ ఉందని తెలుస్తోంది.
లాహోర్ నగరానికి ఉన్న భిన్న మతాలు, విభిన్న సంస్కృతుల గుర్తింపును గౌరవించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ చారిత్రక నిర్ణయం కేవలం వీధుల పేర్లకే పరిమితం కాలేదు. మహారాజా రంజిత్ సింగ్ కాలం నాటి కట్టడాలు, పురాతన చర్చిలు, చారిత్రక క్రికెట్ మైదానాలకు కూడా పేర్లను పునరుద్ధరించే పనిలో ఉందని సమాచారం. ఏదీఏమైన మళ్లీ ఇన్నేళ్ల తర్వాత పాత పేర్లను పెట్టాలని నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం.