తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా. గత ఏడాదితో పోలిస్తే రుతుపవనాల రాక 4 నుంచి 5 రోజులు ఆలస్యం కానుందని తెలుస్తోంది.
ఈ నెల 26వ తేదీన కేరళను తాకనున్న రుతుపవనాలు, ఆ తర్వాత సాధారణంగా 4 నుంచి 7 రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులు, బంగాళాఖాతం, అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవి మరింత ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది.
ఇదిలా ఉండగా, రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్న పరిస్థితులు నెలకొన్నాయి.