తెలంగాణలో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో గ్లాస్ బ్రిడ్జి రూపుదిద్దుకుంటోంది.
కాకతీయుల కాలం నాటి చారిత్రక ఎల్లమ్మ చెరువులో గాజువంతెనను నిర్మిస్తుండటం విశేషం. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో చెరువు సుందరీకరణ పనుల్లో భాగంగా ఈ బ్రిడ్జ్ ను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం రూ.4.22 కోట్ల వ్యయంతో, 150 మీటర్ల పొడవు, 5 అడుగుల వెడల్పుతో లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కేవలం గ్లాస్ బ్రిడ్జికే పరిమితం కాకుండా, చెరువు పరిసరాలను పూర్తిస్థాయి వినోద కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ బతుకమ్మ ఘాట్, వాకింగ్ ట్రాక్, గార్డెన్లు, ప్రత్యేక లైటింగ్, సెల్ఫీ పాయింట్లను కూడా అభివృద్ధి చేస్తుండటం విశేషం.
మరో రెండు, మూడు నెలల్లో ఈ గ్లాస్ బ్రిడ్జ్ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోనే తొలి గాజు వంతెన కావడంతో నిర్మాణం జరుగుతుండగానే స్థానికులు, పర్యాటకులు దీన్ని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.