– విజయ్ ప్రభుత్వానికి కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే పార్టీల సంపూర్ణ మద్దతు
– అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల సపోర్ట్ తో బలపడిన టీవీకే కూటమి
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం శాసనసభలో విశ్వాస పరీక్షను ఎదుర్కొంది. ఎన్నో నాటకీయ రాజకీయ పరిణామాల మధ్య జరిగిన ఈ బలపరీక్ష, అన్నాడీఎంకేలో విభేదాలను బహిర్గతం చేసింది.
విజయ్ తీర్మానం ప్రవేశపెట్టిన వెంటనే కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి తమ మద్దతును అధికారికంగా ప్రకటించారు. అలాగే విదుతలై చిరుతైగల్ కట్చి పార్టీ కూడా విశ్వాస తీర్మానానికి మద్దతు పలికింది. అంతేకాదు అనూహ్యంగా అన్నాడీఎంకేకు చెందిన సీనియర్ నేతలు షణ్ముగం, వేలుమణి నేతృత్వంలోని రెబల్ ఎమ్మెల్యేల వర్గం కూడా విజయ్ ప్రభుత్వానికే మద్దతు ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తర్వాత నాయకత్వ సంక్షోభంలో ఉన్న అన్నాడీఎంకేలో అంతర్గత కలహాలు ఎక్కువ అయ్యాయని ఈ పరిణామంతో స్పష్టమైంది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాలున్న సభలో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ, మెజారిటీ మార్కును అందుకోలేకపోయింది. దీంతో కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే మద్దతుతో టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే తన బలాన్ని నిరూపించుకోవడానికి అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కొంది.