తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని పాఠశాలలు, ప్రార్థనా మందిరాల వద్ద ఉన్న మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. విజయ్ తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 717 మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేవాలయాలు, చర్చిలు, మసీదులు, పాఠశాలలు, కళాశాలలు అలాగే బస్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఎలాంటి మద్యం దుకాణాలు ఉండకూడదని స్పష్టం చేసింది.
రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రార్థనా మందిరాలు, స్కూళ్లు, కాలేజీలు, బస్టాండ్ లకు సమీపంలో నడిచే మద్యం షాపులన్నీ రెండు వారాల్లోగా మూసివేయాలని విజయ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా TASMAC ఆధ్వర్యంలో మొత్తం 4,765 మద్యం రిటైల్ దుకాణాలు నడుస్తున్నాయి. వాటిలో 717 దుకాణాలను మూసివేయనుంది. ఇందులో 276 మద్యం షాపులు ప్రార్థనా మందిరాలకు సమీపంలోనే ఉండగా.. మరో 186 విద్యాసంస్థలు, 255 బస్స్టాండ్లకు దగ్గరలో ఉన్నాయి.