పశ్చిమాసియా యుద్ధ ప్రభావం కాస్త ఎక్కువగానే ఉంది. హైదరాబాద్ వేదికగా ప్రధాని మోదీ చేసిన కీలక సూచనలు ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేశాయి. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలని, వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్, కార్ పూలింగ్ ను ఉపయోగించుకోవాలని కోరడం దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇంధన దిగుమతుల భారాన్ని తగ్గించడానికి, దేశీయంగా ఇంధనాన్ని పొదుపు చేయాలని ప్రధాని మోదీ కోరారు.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో .. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. దీంతో దేశంలో ఇంధన ధరల పెంపు అనివార్యంగా కనిపిస్తోంది. అందుకే ప్రధాని మోదీ ఈ కీలక విజ్ఞప్తి చేసి ఉంటారనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ, వినియోగదారులపై భారం పడకుండా చమురు సంస్థలు తక్కువ ధరకే ఇంధనాన్ని విక్రయిస్తున్నాయి. దీని వల్ల ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు రోజుకు సుమారు రూ.2 లక్షల కోట్ల వరకు నష్టం వాటిల్లుతోందని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఈ త్రైమాసికంలో రూ.2 లక్షల కోట్ల వరకు వసూళ్లలో లోటు ఉంటుందని, సుమారు రూ. లక్ష కోట్ల నష్టాలు నమోదు అవుతాయని అంచనా. చమురు కంపెనీలపై ఒత్తిడి పెరుగుతుందని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ ప్రతి రోజూ రిటైల్ స్టేషన్లకు వచ్చే 6 కోట్ల మందికి పైగా వినియోగదారులకు భారం పడకుండా చూసుకోగలిగామన్నారు. అంతేకాదు మోదీ ప్రభుత్వం రిటైల్ ఇంధనంపై ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం వల్ల ఒక నెలలో రూ.14,000 కోట్ల ఆదాయ నష్టాలను చవి చూసిందని మంత్రి తెలిపారు.
ప్రస్తుతం దేశంలో ముడి చమురు, ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. భారత్ కు వచ్చే ఇంధన దిగుమతుల్లో దాదాపు 90 శాతం గల్ఫ్ ప్రాంతం నుంచే వస్తున్నాయని, అయినప్పటికీ అంతరాయాన్ని తగ్గించే చర్యలు వేగంగా చేపట్టామని తెలిపారు. దేశంలో అన్ని రకాల ఇంధన సరఫరాలు తగినంత ఉన్నాయని, భయంతో అధికంగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రపంచ అనిశ్చితి సమయంలో దేశంపై ఆర్థికభారం తగ్గించడం, ఇంధన పొదుపు లక్ష్యంతోనే ప్రధాని మోదీ ఆ పిలుపును ఇచ్చారని తెలిపారు. ఈ క్రమంలోనే అవసరం లేని ప్రయాణాలను తగ్గించి, ఇంధనాన్ని ఆదా చేయాలని మోదీ ఇచ్చిన సందేశాన్ని, సరఫరా కొరతకు ప్రతిస్పందనగా కాకుండా ఇంధన పొదుపు దృష్టితో చూడాలని సూచించారు.
తీవ్ర సంక్షోభం ఉన్నప్పటికీ.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది. అదేవిధంగా ప్రస్తుతం సుమారు 60 రోజులకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని చెప్పింది.. అయితే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తమకు కలిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి అతి త్వరలోనే పెట్రో ధరలను పెంచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఈ పెరుగుదల ఒకేసారి కాకుండా దశల వారీగా ఉండొచ్చనే సంకేతాలు కన్పిస్తున్నాయి. మొత్తంగా పెట్రోల్, డీజిల్ పై రూ.15, వంట గ్యాస్ పై సిలిండర్ కు రూ.50 దాకా పెంచవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.